నేపాల్ వరదలు: ''నా కళ్లముందే మా వాళ్లు కొట్టుకు పోయారు'' అంటున్న బాధితులు, 160 దాటిన మృతుల సంఖ్య

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఆకస్మికంగా సంభవించిన భారీ వరదలతో నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో తీవ్రస్థాయిలో విధ్వంసం జరిగింది. ఇప్పటి వరకు 162 మంది చనిపోయారని నేపాల్ పోలీసులు ప్రకటించారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

చాలామంది ఆచూకీ లభించడంలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వందమందికిపైగా నేపాలీలు, వందమందికి పైగా భారతీయులు కూడా మిస్సయినవారిలో ఉన్నారు.

గల్లంతయిన వారిలో నేపాలీ పోలీసు అధికారులు, ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. అమెరికన్లు 54మంది, యూకేకు చెందిన 33మంది ఆచూకీ తెలియడం లేదని నేపాల్ టూరిజం బోర్డ్ వెల్లడించింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

వరదల్లో 53మంది యుక్రేనియన్లు కనిపించకుండాపోయారని యుక్రెయిన్ విదేశాంగశాఖ తెలిపింది. 34మంది తమ దేశస్థులు గల్లంతయ్యారని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ధ్రువీకరించారు.

వరదల్లో గాయపడ్డ కొందరు కాఠ్‌మాండూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సభ్యులు కళ్లముందే వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం చూశామని ప్రాణాలతో బయటపడ్డ కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. వరదలు రావడంతో ఇంటి పైకప్పు ఎక్కి తాను, తన కొడుకు ప్రాణాలతో బయటపడ్డామని ఓ మహిళ చెప్పారు.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Reuters

సహాయక సామాగ్రి తరలింపు

వరదలు సంభవించిన నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో యాత్రికులు, ట్రెక్కర్లు భారీ సంఖ్యలో ఉంటారు.

నేపాల్ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురయిందని ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు ఎనిమిది టన్నుల సహాయకసామగ్రిని పంపించినట్టు ప్రధాని బాలేంద్ర షా కార్యాలయం తెలిపింది.

నేపాల్ ఆర్మీకి చెందిన ఎనిమిది ట్రక్కుల ద్వారా ఈ సామాగ్రిని పంపించినట్టు వెల్లడించింది. దోమతెరలు, దుప్పట్లు, సోలార్ లైట్లు, సోలార్ ప్యానెళ్లు, స్లీపింగ్ బ్యాగులు వంటివి ఇందులో ఉన్నాయి.

భారత్, చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా పలు దేశాలు సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి.

భారీ వరదలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో విచారం వ్యక్తంచేశారు. నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న సహాయకచర్యలకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి బృందాలు, భాగస్వామి సంస్థలు అవసరమైన సామాగ్రిని, సిబ్బందిని సమీకరిస్తున్నాయని తెలిపారు.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

వరదలకు అసలు కారణం?

రసువా జిల్లాలో భోటేకోశి నది ఆకస్మికంగా పొంగిపొర్లడంతో వరదలు ముంచెత్తాయి. నువాకోట్ ప్రాంతంలో ఇల్లు, రోడ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసమయ్యాయి.

వరదలకు మొదట భూకంపం కారణమని అధికారులు భావించారు. కానీ హిమనీనదం ఉధృతి పెరగడం, దానివల్ల మట్టి, రాళ్ల ప్రవాహం కారణంగా భూకంపం తరహా ప్రకంపనలు ఏర్పడ్డాయని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) విశ్లేషించింది.

ఓ పర్వతం నుంచి భారీ మంచుముక్క కూలిపోయి ఉండొచ్చని, దాంతో పాటు రాళ్లు, ఇతర అవశేషాలు కిందకి కొట్టుకుని ఉండొచ్చని నేపాల్ వాతావరణ, జలవిజ్ఞాన విభాగానికి చెందిన అధికారులు బీబీసీతో చెప్పారు.

హిమనీనదాలు కరిగిపోవడానికి వాతావరణ మార్పులు కారణమని భావిస్తారు. అయితే నేపాల్ వరదలకు కూడా అదే కారణమా అన్నది ఇప్పుడే చెప్పలేమని సైంటిస్టులు అంటున్నారు.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

నేపాల్ అధికారులేమంటున్నారు?

రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా, చిత్వాన్ సహా నేపాల్‌లోని పలు జిల్లాలపై వరద ప్రభావముంది. టిబెట్ ప్రాంతంలో అనేక హిమనీనద సరస్సులున్నాయి. నేపాల్ వైపు వాలుగా ఉన్న ప్రాంతంలో ఎక్కువమంది నివసిస్తున్నారు.

ఈ సరస్సులకు అకస్మాత్తుగా గండిపడడం లేదా మంచుచరియలు విరిగిపడడం వల్ల భారీ నష్టం జరిగే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరగడం, దాని వల్ల ఆ ప్రాంతంలో వచ్చిన మార్పులే దీనికి కారణంగా భావించొచ్చని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ధర్మరాజ్ ఉప్రేతి అన్నారు.

నేపాల్, టిబెట్ మధ్య ఉత్తర సరిహద్దుకు ఇరువైపులా ఎత్తయిన హిమాలయ పర్వత శ్రేణులున్నాయి.

హిమాలయప్రాంతంలోని హిమనీనదాలు, వాటి వల్ల ఏర్పడ్డ సరస్సులు, నేపాల్ వైపు ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని నిపుణులు తెలిపారు.

వర్షాకాలంలో భారీ వర్షపాతం, హిమనీనదాల్లో మార్పులు, మంచుచరియలు తక్కువ సమయంలోనే పెద్దమొత్తంలో నీటిని, రాళ్లను, మట్టిని దిగువ తీర ప్రాంతాలకు రవాణా చేస్తాయని చెప్పారు.

గత ఏడాది కూడా రసువా ప్రాంతంలో వరదలు రావడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగాయి.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, X/@DrSJaishankar

వరదలను నివారించగలమా?

ఇలాంటి విపత్తులను పూర్తిగా నివారించలేమని త్రిభువన్ విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ ఠకురి చెప్పారు.

‘‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. హిమసరస్సులు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ఈ వ్యవస్థ ద్వారా సరస్సులోని నీటి మట్టం, సహజ అడ్డుకట్టపై రియల్ టైమ్ సమాచారం అందుతుంది. ఇలాంటి ఘటనల గురించి ముందే సమాచారం తెలిస్తే ప్రాణనష్టం తగ్గించవచ్చు’’ అని ఆయన అన్నారు.

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, Reuters

నేపాల్ చరిత్రలోనే భారీ విధ్వంసం?

వరదల వల్ల అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులు, బ్యాంకులు ధ్వంసమయ్యాయి. పలు వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయని నేపాల్ మీడియా రిపోర్ట్ చేస్తోంది.

1993లో సర్లాహి, రౌతహత్, మక్వాన్‌పూర్‌ల్లో సంభవించిన వరదనే నేపాల్ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా భావిస్తారు. ఆ వరదల్లో 1,400మంది మరణించారు. ఆ వరదల కంటే ఇవి మరింత విధ్వంసకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)