‘ఇమ్రాన్ ఖాన్కు మంచి వైద్యం అందించడం మానవత్వం’: కపిల్, గావస్కర్ సహా మాజీ క్రికెటర్ల లేఖ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్.జి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు సరైన వైద్యం అందించాలని వివిధ జట్ల మాజీ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. వీరిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సర్ అలస్టర్ కుక్, ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గావస్కర్ వంటివారు ఉన్నారు.
క్రికెటర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలపై అరెస్టై జైలులో ఉన్నారు. కానీ ఆ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై 21మంది మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
గత వారం ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, కొన్ని గంటలు మాత్రమే అక్కడ ఉంచి, ప్రభుత్వ వైద్య బృందం పరీక్షించిందని.. పాకిస్తాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తన సొంత వైద్యులను కలిసే అవకాశం ఇమ్రాన్ ఖాన్కు ఇవ్వలేదని ఆ పార్టీ ఆరోపించింది.

మాజీ క్రికెటర్ల మూడు డిమాండ్లు
మాజీ క్రికెట్ కెప్టెన్లు పాక్ ప్రధానికి రాసిన లేఖలో మూడు డిమాండ్లు చేశారు.
- సుప్రీంకోర్టు ఆదేశించిన మెడికల్ బోర్డ్ ఇమ్రాన్ ఖాన్ను పరీక్షించాలని కోరారు. వీరిలో ఆయన సొంత వైద్యులు కూడా ఉండాలి. ఆయన కుడి కంటికి చూపు తగ్గిందంటూ వార్తలు రావడంతో కంటి పరీక్ష చేయాలని అన్నారు.
- కోర్టు ఆదేశించినట్టుగా ప్రతి వారం ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోరారు. ఎలాంటి అడ్డంకులు లేదా ఆలస్యం లేకుండా చూడాలని అన్నారు.
- మెడికల్ బోర్డు సూచించిన ట్రీట్మెంట్ను వెంటనే అందించాలని కోరారు.
ఇమ్రాన్ ఖాన్కు 73 ఏళ్లు. ఆయన ఇప్పటికే మూడేళ్లకు పైగా జైలులో ఉన్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ పేర్కొన్నట్లు ఆ లేఖలో ఉంది.
ఇమ్రాన్ ఖాన్ కేసులో చట్టపరమైన, రాజకీయ విషయాలు ఎలా ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశించిన వైద్య పరీక్షలు జరిగేలా చూడటం కనీస మానవత్వం. ఇందులో తప్పుపట్టడానికేమీ లేదని మాజీ కెప్టెన్లు అన్నారు.
ఈ లేఖపై ఇంగ్లండ్కు చెందిన మైఖేల్ అథర్టన్, మైఖేల్ బ్రియర్లీ, నాసర్ హుస్సేన్, ఆండ్రూ స్ట్రాస్, డేవిడ్ గోవర్, భారత్కు చెందిన కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్, ఆడమ్ గిల్క్రిస్ట్, స్టీవ్ వా, కిమ్ హ్యూస్ సంతకం చేశారు.
14 మంది మాజీ కెప్టెన్లు ఇంతకుముందు ఫిబ్రవరిలో కూడా ఒక లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్కు మానవతా దృక్పథంతో మంచి వైద్యం అందించాలని ఆ లేఖలో కోరారు.
జైలు అధికారులు సకాలంలో స్పందించి, ట్రీట్మెంట్ చేయించకపోవడంతో ఆయన కుడి కంటిలో కేవలం 15% మాత్రమే చూపు మిగిలిందని అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ లాయర్ చెప్పారు.
ఈ లేఖలపై మాజీ కెప్టెన్లు సంతకం చేసి పాక్ ప్రధానికి పంపించారు.
మేం క్రికెట్ మైదానంలో కలిసి ఆడిన సహచరులం, ప్రత్యర్థులం అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. క్రికెట్ వల్ల ఏర్పడిన తమ బంధం దేశాల మధ్య ఉన్న సరిహద్దులు, వివాదాలకు అతీతమైందని అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. తర్వాత 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు.
2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపై ఆయన జైలుకెళ్లారు. అప్పటి నుంచి 100కు పైగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నేతలు అంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. వీటిని అక్కడి ప్రభుత్వం అణచివేసింది.
మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్ట్.. ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కానీ ఆయనను ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులే పరీక్షించి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)





























