తమిళనాడు: జోసెఫ్ విజయ్‌ను ‘భవిష్యత్ ప్రధానమంత్రి’ అని టీవీకే నేతలు ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్‌ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారు

జోసెఫ్ విజయ్‌, టీవీకే పార్టీ

ఫొటో సోర్స్, TVKHQ

ఫొటో క్యాప్షన్, పలువురు టీవీకే మంత్రులు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను "భవిష్యత్ ప్రధానమంత్రి" అని పిలుస్తున్నారు
    • రచయిత, విజయానంద అరుముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

''రాత్రింబవళ్లు టైమ్ చూసుకోకుండా ఎవరైతే పనిచేస్తారో, వారే భవిష్యత్‌లో భారత ప్రధాని అవుతారు'' అని తమిళనాడు మంత్రి శరత్‌కుమార్ ఆగస్టు 18న ఆ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.

దీంతో, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ''భవిష్యత్‌ ప్రధానమంత్రి''గా పలువురు టీవీకే మంత్రులు పిలుస్తున్నారు.

దీనిపై మాట్లాడిన తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్‌.. టీవీకే నాయకులు ఇంకా ఫ్యాన్ క్లబ్ మనస్తత్వంలోనే జీవిస్తున్నారని అన్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మెజారిటీ రానప్పుడు, కాంగ్రెస్ పార్టీ తన అయిదుగురు ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆ సమయంలో పనైయూర్‌లో టీవీకే నేత విజయ్‌ను కలిసిన కాంగ్రెస్ నేత గిరీశ్ ఛోడంకర్.. "స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే లోక్‌సభ ఎన్నికలలో కూడా టీవీకేతో పొత్తు కొనసాగుతుంది" అని ప్రకటించారు.

మే 10న జరిగిన తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చారు. విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులను ఇచ్చింది.

మరోవైపు, గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ఆయన మంత్రులు 'కాబోయే ప్రధానమంత్రి' అని చిత్రీకరిస్తున్న తీరు కాంగ్రెస్‌లో అనేక చర్చలకు దారితీసింది.

జోసెఫ్ విజయ్‌, టీవీకే పార్టీ

ఫొటో సోర్స్, Sarath/X

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో మంత్రి శరత్‌కుమార్ (ఫైల్ ఫోటో)

'నేటి ముఖ్యమంత్రి, రేపటి ప్రధానమంత్రి'

ఆగస్టు 18న అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ విభాగానికి గ్రాంట్ల జారీ డిమాండ్లపై చర్చ జరిగిన సందర్భంగా.. ''విజయ్ భవిష్యత్‌లో ప్రధానమంత్రి అవుతారు'' అని మంత్రి శరత్‌కుమార్ అన్నారు.

సామాజిక సంక్షేమ మంత్రి జగదీశ్వరి ఆగస్టు 22న విరుధునగర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ జాబ్ ఫెయిర్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో మాట్లాడిన జగదీశ్వరి.. ''నేటి ముఖ్యమంత్రి, రేపటి ప్రధానమంత్రి. భవిష్యత్‌లో కేవలం మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది'' అని అన్నారు.

అనంతరం, ఒక బహిరంగ సభలో రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి కె.ఎ. సెంగోట్టయ్యన్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి కేవలం తమిళనాడును పాలించే శక్తి మాత్రమే కాదు. భారత భవిష్యత్తును పాలించగల శక్తిగా కూడా ఎదగగలరు" అని తెలిపారు.

తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కూడా ఒక వేదికపై మాట్లాడుతూ.. ''ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా.. దృష్టంతా ఆయనపైనే. రేపు ఆయన దిల్లీని కూడా పాలించవచ్చు'' అని అన్నారు.

తిరుప్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. "2029లో జోసెఫ్ విజయ్ భారత ప్రధాని కావడం సాధ్యమే. మేం ఆ దిశగా పయనిస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.

''మూడేళ్లలో తమిళనాడు ఎంతో మెరుగుపడుతుంది. ఆ తర్వాత భారత అభివృద్ధి. ఒకవేళ భారత్ అభివృద్ధి చెందాలంటే, దానికొక నాయకుడు కావాలి. అలాంటి నాయకుడు మన ముఖ్యమంత్రి మాత్రమే'' అని అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్

ఫొటో సోర్స్, R.Satish BABU / AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్

'ఫ్యాన్-గ్రూప్ మెంటాలిటీ'

టీవీకే మంత్రులు నిరంతరం చేస్తున్న ఈ ప్రకటనల గురించి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్కం ఠాగూర్‌ను జర్నలిస్టులు ప్రశ్నించారు.

''ఫ్యాన్ క్లబ్ మనస్తత్వంలో జీవించే ప్రజలు ఎప్పటికీ మారరు'' అని అన్నారు.

ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి పేర్లను ప్రస్తావిస్తూ.. "వారు నియోజకవర్గాల పునర్విభజన తీసుకురావాలని యోచిస్తున్నారు. మనం ఈ కొట్లాటలో చిక్కుకున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

''మాణిక్కం ఠాగూర్‌ విమర్శలు టీవీకే నేతలు, అధికారులు రాజకీయాల్లో ఇంకా పరిణతి చెందలేదని చూపిస్తున్నాయి'' అని సీనియర్ జర్నలిస్ట్ శ్యామ్ వ్యాఖ్యానించారు.

"జోసెఫ్ విజయ్‌ను ఆ పార్టీ నేతలు భవిష్యత్ ప్రధానమంత్రిగా చెబుతుండడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తుంది. కానీ, ఈ విషయాన్ని టీవీకే వాళ్లు మాత్రమే లేవనెత్తుతున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు" అని సీనియర్ జర్నలిస్ట్ మాళన్ అన్నారు.

జయలలిత

ఫొటో సోర్స్, SESHADRI SUKUMAR/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలిత

'దేశ నాయకుడిగా ఆయన్ని నిలబెట్టే ప్రయత్నాలు'

జోసెఫ్ విజయ్‌ను భవిష్యత్ ప్రధానమంత్రిగా చెబుతుండడం వెనుక అనేక వ్యూహాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అన్నారు.

"రాష్ట్ర రాజకీయాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, టీవీకే తన నాయకుడు విజయ్‌ను కేవలం రాష్ట్ర నాయకుడిగా పరిమితం చేయాలని అనుకోవడం లేదు. జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్న నాయకుడిగా ఆయనను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది" అని శ్యామ్ చెప్పారు.

విజయ్ అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. '' ఇది అభిమానులను చురుకైన రాజకీయ కార్యకర్తలుగా మారడానికి ప్రోత్సహించి, పార్టీ పునాదిని తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని ఆయన విశ్వసిస్తున్నారు'' అని తెలిపారు.

"కాంగ్రెస్‌తో సహా పొత్తు భాగస్వాములతో ఒప్పందంలో ఉంటూనే, టీవీకే ప్రాముఖ్యాన్ని, సంప్రదింపుల శక్తిని పెంచి చూపించడానికి దీనిని ఒక వ్యూహంగా ఉపయోగిస్తున్నారు" అని శ్యామ్ చెప్పారు.

''పార్టీ వర్గాలు టీవీకేని జాతీయ స్థాయిలో చూపించాలని భావిస్తున్నాయి. జాతీయ మీడియా టీవీకేని కేవలం ఒక రాష్ట్రాన్ని పాలించే పార్టీగా మాత్రమే చూడకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశం'' అని సీనియర్ జర్నలిస్ట్ మాళన్ అన్నారు.

తమిళనాడులో గతంలో రాష్ట్ర పార్టీల నాయకులను ప్రధానమంత్రి పదవికి అభ్యర్థులుగా చూపించే ప్రయత్నాలు జరిగాయని కూడా మాళన్ గుర్తు చేశారు.

ఏఐఏడీఎంకే అధినేత జయలలిత 2014 లోక్‌సభ ఎన్నికలలో "మోదీ ఆర్ లేడీ" అనే నినాదాన్ని ప్రారంభించారు.

అంతకుముందు, 2013 డిసెంబర్‌లో జయలలితను తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని ఏఐఏడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అయితే, అది పార్టీ నిర్ణయమని, ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకోవడంపై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జయలలిత అప్పట్లో చెప్పారు.

2014 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులో ఏఐఏడీఎంకే 37 స్థానాలను గెలుచుకుంది.

''ఒకవేళ టీవీకే 2029 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకుంటే, కొన్ని విషయాలు జరిగే అవకాశం ఉంది'' అని ఈ విషయాన్ని భిన్నమైన కోణంలో చూస్తూ శ్యామ్ చెప్పారు.

దీని వెనుక ఉన్న దీర్ఘకాలిక ప్రణాళిక ఏంటంటే... జాతీయ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకోగల శక్తిగా టీవీకే అవతరించడమేనని ఆయన అన్నారు.

టీవీకేకి ప్రజల మద్దతు ఉందని, జాతీయ స్థాయిలో అది ఒక ముఖ్యమైన శక్తిగా మారుతుందని భావిస్తోందని మాళన్ చెప్పారు.

"అయితే, టీవీకే ఇచ్చిన ఈ నినాదం లోక్‌సభ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపదు. ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీనే అవుతారు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

''ప్రస్తుతానికైతే టీవీకే ఇండియా కూటమిలో లేదు. 2029లో ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తాయా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. దానికి ఇంకా సమయం ఉంది. 'ప్రధానమంత్రి విజయ్' అనే నినాదాన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు'' అని మాళన్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌

ఫొటో సోర్స్, CMOTamilnadu

ఫొటో క్యాప్షన్, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌

టీవీకే ఏం చెబుతోంది?

టీవీకే జాతీయ స్థాయి అధికార ప్రతినిధుల్లో ఒకరైన న్యాయవాది సత్యకుమార్‌తో బీబీసీ దీనిపై మాట్లాడింది. పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే ఇలాంటి ప్రకటనలు చేశారా? అని అడిగింది.

''జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి కావడం అవసరం. ముఖ్యంగా భారత ఓటర్లలో జెన్ జడ్ తరానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను ఎంచుకుంటున్నారు'' అని చెప్పారు.

''వారొక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మిగతా పార్టీలకు అంత బలమైన నాయకులు లేరు. ఇది విజయ్‌కు ప్రయోజనకరంగా మారింది'' అని తెలిపారు.

"టీవీకే నాయకుడిని ఉత్తరాదిలో ఆమోదిస్తారా?" అని అడిగినప్పుడు...''జోసెఫ్ విజయ్ ప్రసంగాలు ఉత్తరాది భాషలలోకి అనువదిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆయన మోడ్రన్ రూపం, రెండేళ్లలోనే అధికారంలోకి రావడం విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి'' అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)