ఇజ్రాయెల్‌కు కొరకరాని కొయ్యగా మారిన 'ఒంటి కన్ను' మిలిటెంట్

ప్రచురణ

ఇటీవల పాలస్తీన మిలిటెంట్‌ ఒకరు తన కరకు స్వరంతో ఇజ్రాయెల్‌కు ఓ హెచ్చరిక పంపారు. హమాస్ డిమాండ్‌లు నెరవేర్చక పోతే ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నది ఆ హెచ్చరిక సారాంశం.

ఆ మిలిటెంట్ పేరు మహ్మద్ డేఫ్‌. ప్రస్తుతం గాజాను తన ఆధీనంలో ఉంచుకున్న హమాస్‌ మిలిటరీ వింగ్‌కు ఆయన నాయకుడు.

గాజాలో ఇజ్రాయెల్‌కు మోస్ట్ వాంటెడ్ లీడర్ మహ్మద్ డేఫ్‌. గాజా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఏడేళ్ల తర్వాత మహ్మద్ డేఫ్‌ గొంతు తొలిసారి వినిపించింది.

కాకపోతే, ఆయన హెచ్చరికలను ఆ సమయంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 11 రోజుల ఘర్షణ తర్వాత గాజా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

గాజా వైపు 242మంది చనిపోగా, ఇజ్రాయెల్‌ నుంచి 13మంది మరణించారని ఐక్య రాజ్య సమితి వెల్లడించింది. గాజాలో మరణించిన వారిలో 129 మంది సామాన్య ప్రజలు. అయితే, ఇజ్రాయెల్ మాత్రం చనిపోయిన వారిలో 200 మంది మిలిటెంట్లేనని చెబుతోంది.

ఇటు తమ మిలిటరీలో చనిపోయింది 80 మంది మాత్రమే అని హమాస్ నాయకుడు యాహ్య సిన్వార్ ప్రకటించారు. ఆ చనిపోయిన గాజా సైన్యంలో మహ్మద్ డేఫ్‌ లేరు.

''డేఫ్‌ను చంపాలన్నదే మా ఆపరేషన్ ప్రధాన లక్ష్యం'' అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్‌ ప్రతినిధి హిదాయి జిల్బర్మన్‌ అన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

ఇటీవలి ఘర్షణల సందర్భంగా కనీసం రెండుసార్లు డేఫ్‌‌ను చంపేందుకు ప్రయత్నించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బీబీసీకి ధ్రువీకరించింది. దీంతో డేఫ్‌ ఇప్పటి వరకు ఏడుసార్లు ఇజ్రాయెల్ హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నట్లయింది.

ఆయనను చంపడానికి ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలతో విసిగి పోయిన ఇజ్రాయెలీ దళాలు, ఇటీవలి ఘర్షణల సందర్భంగా హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాయి.

''హమాస్‌లో అత్యంత ముఖ్యమైన నాయకులెవరు అన్నదానిపై వారి దగ్గర ఒక జాబితా ఉంది.'' అని మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ ఎనలిస్ట్ మాథ్యూ లెవిట్ బీబీసీతో అన్నారు. ''అందులో అగ్రభాగంలో ఉన్న పేరు మహ్మద్ డేఫ్‌'' అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)